చిట్యాల టీటీడీ భూమి పరిరక్షణలో బీఆర్ఎస్ విజయం
చిట్యాల టీటీడీ భూమి పరిరక్షణలో బీఆర్ఎస్ విజయం
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ పరిధిలో టిటిడి కళ్యాణ మండపం నిర్మాణం కోసం దాతల సహకారంతో కొనుగోలు చేసిన భూమి అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటం ఫలించిందని బీఆర్ఎస్ చిట్యాల పట్టణ నాయకుడు బొబ్బల శివశంకర్రెడ్డి అన్నారు. గురువారం చిట్యాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదేశాల మేరకు కళ్యాణ మండపం భూమి పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేసినట్లు తెలిపారు. పార్టీ పోరాటం కారణంగానే కళ్యాణ మండపం కోసం కొనుగోలు చేసిన భూమి తిరిగి పట్టణ ప్రజలకు దక్కే పరిస్థితి ఏర్పడిందన్నారు. తాజాగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ.. కళ్యాణ మండపం నిర్మాణం కోసం ఎకరం 12 గుంటల భూమిని కొనుగోలు చేసినట్లు, ఆ భూమిని యథాతథంగా అప్పగించాలని స్పష్టం చేసినట్లు శివశంకర్రెడ్డి తెలిపారు. భువనగిరి రోడ్డును సరిహద్దుగా చేసుకుని ఎకరం 12 గుంటల భూమిని తహసీల్దార్, రెవెన్యూ సర్వేయర్, మున్సిపల్ కమిషనర్ సంయుక్తంగా సర్వే చేయాలని అఖిలపక్ష సమావేశంలో సూచించినట్లు చెప్పారు. అధికారులు వెంటనే సర్వే నిర్వహించి భూమిని తమ ఆధీనంలోకి తీసుకోవాలని, భవిష్యత్తులో ఎలాంటి కబ్జాలకు, అన్యాక్రాంతానికి అవకాశం లేకుండా చుట్టూ పూర్తిస్థాయిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ఇంతటితో ఆగదని, చిట్యాల పట్టణంలోని సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని శివశంకర్రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, 10వ వార్డు కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్, 2వ వార్డు కౌన్సిలర్ ఎస్కే షబానా అజీముద్దీన్, సింగిల్ విండో డైరెక్టర్ కన్నెబోయిన శ్రీశైలం, సాయిరెడ్డి ప్రతాపరెడ్డి, పాల కృష్ణ, ఆగు అశోక్ యాదవ్, నలవత్ కృష్ణ, బులుగురు సైదులు, జిట్టా శేఖర్, మద్ది మధు, ఎండీ మజ్జు తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.