చిట్యాలలో కాలుష్య పరిశ్రమలపై బీఆర్ఎస్ ఆందోళన
చిట్యాలలో కాలుష్య పరిశ్రమలపై బీఆర్ఎస్ ఆందోళన
దుర్వాసన వెదజల్లుతున్న పరిశ్రమలపై తక్షణ చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని పరిశ్రమల నుంచి వెలువడుతున్న విషపూరితమైన పొగ, దుర్వాసనతో పట్టణ ప్రజల ఆరోగ్యం తీవ్ర ముప్పులో పడిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎంపీఎల్ కంపెనీతో పాటు సమీపంలోని ఇతర పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యం కారణంగా ప్రజలు శ్వాసకోశ సమస్యలు, కళ్ల మంటలు, తలనొప్పి వంటి అనేక అనారోగ్య సమస్యలతో అల్లాడిపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పై గురువారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు చిట్యాల మున్సిపల్ కమిషనర్ గురులింగం కు ఒక వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కలిసి పరిశ్రమలను వెంటనే పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి సమయంలో అధికంగా దుర్వాసన, విషపూరిత వాయువులను వదులుతున్న పరిశ్రమలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న పరిశ్రమ యాజమాన్యాలపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజల ఆరోగ్యం కంటే పరిశ్రమల లాభాలు ముఖ్యం కావు అని, కాలుష్య సమస్యను అధికారులు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం అని హెచ్చరించారు. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అధికారులు, ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, జమాండ్ల శ్రీనివాస్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు నిమ్మనగోటి శ్రీనివాస్ (10వ వార్డు), ఎస్కే షబానా అజీముద్దీన్ (2వ వార్డ్)లతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొబ్బల శివశంకర్ రెడ్డి, ఆగు అశోక్ మరియు టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు...