చంద్రబాబు ఆదేశాలే తనకు మార్గదర్శకం: బోండా ఉమా
చంద్రబాబు ఆదేశాలే తనకు మార్గదర్శకం: బోండా ఉమా
విజయవాడ, జూలై 29: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలను ఎప్పుడూ శిరసావహిస్తానని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ముందు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇటీవల నిర్వహించిన సంస్మరణ సభకు హాజరైన సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలను కలవాల్సి వచ్చిందని, అయితే ఆ విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారని తెలిపారు. తాను మాట్లాడిన వ్యాఖ్యలను కూడా వక్రీకరించి ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది పూర్తిగా సమన్వయ లోపం వల్లే జరిగిందని కమిటీకి వివరించినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తానని కమిటీకి హామీ ఇచ్చినట్లు బోండా ఉమా వెల్లడించారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి చంద్రబాబు సూచనల మేరకు ముందుకు సాగుతానని ఆయన పునరుద్ఘాటించారు.