చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ విమర్శల దాడి
తిరువూరు, జూన్ 3: తిరువూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాసు ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నల్లగట్ల స్వామిదాసు కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చెప్పుకోదగ్గ మేలు ఏదీ చేయలేదని ఆయన ఆరోపించారు. జగన్ కంటే మెరుగైన పాలన అందిస్తామని హామీ ఇచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
మండల, పట్టణ, జిల్లా కేంద్రాల్లో మేనిఫెస్టో దహన కార్యక్రమాలు చేపట్టి, కూటమి పాలనలో ప్రజలకు జరిగిన నష్టాలను వివరిస్తామని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని పేర్కొన్నారు.
కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని స్వామిదాసు అన్నారు. చంద్రబాబు పేరు చెప్పగానే ప్రజలకు వెన్నుపోటు రాజకీయాలే గుర్తుకు వస్తాయని, ఒకప్పుడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.
కులాలు, మతాలు, టీటీడీ లడ్డూ వంటి అంశాల పేరుతో రాజకీయాలు చేశారని ఆరోపించిన ఆయన, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి, రాష్ట్ర పార్టీ ఎస్ఈసీ సభ్యుడు మద్దిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి, రాష్ట్ర పార్టీ జాయింట్ కార్యదర్శి భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి, తిరువూరు పట్టణ పార్టీ అధ్యక్షుడు రేగళ్ల మోహన్ రెడ్డి, గంపలగూడెం మండల పార్టీ అధ్యక్షుడు కావూరి వినయ్, జెడ్పీటీసీ సభ్యుడు కోట శామ్యూల్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.