చనుబండలో రైతు కుటుంబానికి సహకార సంఘం ఆర్థిక సాయం
రైతుల సంక్షేమం, అభివృద్ధే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రధాన లక్ష్యమని చనుబండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు అన్నారు.
చనుబండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యుడు, కృష్ణారావుపాలెం గ్రామానికి చెందిన నర్సింగు రాఘవులు ఇటీవల మృతి చెందారు. ఆయన భార్య జమలమ్మకు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం సంఘం తరఫున రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. గురువారం మధ్యాహ్నం మృతుని ఇంటికి వెళ్లిన సంఘం అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు ఈ మొత్తాన్ని జమలమ్మకు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చనుబండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని రైతులకు సకాలంలో అన్ని రకాల రుణాలు అందిస్తున్నామని తెలిపారు. రైతులకు అవసరమైన రసాయన ఎరువులను కూడా అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. రైతుల శ్రేయస్సు, ఆర్థిక అభివృద్ధి కోసం సంఘం నిరంతరం పనిచేస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కృష్ణారావుపాలెం తాజా మాజీ సర్పంచ్ చిమటబోయిన పుల్లారావు, సంఘం ముఖ్య కార్యనిర్వహణ అధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.