గోసవీడు, కొణిజర్లలో రాజముద్రతో పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ
గంపలగూడెం: రీసర్వే ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో గోసవీడు, కొణిజర్ల గ్రామాల్లో రైతులకు నూతన పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రీసర్వే కార్యక్రమంలో భాగంగా భూ వివరాలను సరిచేసి, ఎలాంటి తప్పులు లేకుండా రైతులకు నూతన పాస్పుస్తకాలను అందజేస్తున్నారు.
తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ గ్రామ పెద్దలు, రెవెన్యూ అధికారుల సమక్షంలో గోసవీడు, కొణిజర్ల గ్రామాలకు చెందిన రైతులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్పుస్తకాలను అందజేశారు.
రీసర్వే ద్వారా రైతుల భూ హక్కులకు మరింత భద్రత కలుగుతుందని అధికారులు తెలిపారు. భూ రికార్డుల్లో ఉన్న లోపాలను గుర్తించి సరిదిద్దడం ద్వారా భవిష్యత్తులో భూ సంబంధిత వివాదాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గంపలగూడెం తహసీల్దార్, సంబంధిత రెవెన్యూ అధికారులు, సిబ్బంది, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.