పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి విగ్రహాలను వాడాలి
పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి విగ్రహాలను వాడాలి: మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి
మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి
ధర్మపురి
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి పిలుపునిచ్చారు. ధర్మపురి పట్టణంలోని స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో "DMD" యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మండపం వద్ద భక్తులకు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాలను అందజేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల కంటే మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. మట్టి విగ్రహాల వల్ల చెరువులు, నదులు మరియు స్థానిక నీటి వనరులు కాలుష్య బారిన పడకుండా ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ స్పృహ కలిగి ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో DMD యూత్ క్లబ్ సభ్యులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు మరియు పుర ప్రజలు పాల్గొన్నారు.