కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్, మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలి
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా
-ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే వీబీజీ రామ్జీ బిల్లు రద్దు అయ్యే వరకు పోరాటం
-వికలాంగుల హక్కులకు తిలోదకలిస్తున్న కేంద్ర ప్రభుత్వం
-పెన్షన్ పెంచకుండా వికలాంగులను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
-NPRD జిల్లా అధ్యక్ష–కార్యదర్శులు సురుపంగా ప్రకాష్, వనం ఉపేందర్ డిమాండ్
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి సందర్భంగా ఈ రోజు జిల్లా కేంద్రంలో లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష–కార్యదర్శులు సురుపంగా ప్రకాష్, వనం ఉపేందర్ మాట్లాడుతూ: పెట్టుబడిదారుల కేంద్ర ప్రభుత్వం సంస్కరణలను వేగంగా అమలు చేస్తోందని విమర్శించారు. 2019లో తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తోందన్నారు. ‘శ్రమశక్తి నీతి–2025’ పేరుతో కార్మికుల ప్రయోజనాలను పెట్టుబడిదారులకు తాకట్టు పెడుతున్నదని ఆరోపించారు. 2025 పార్లమెంట్ సమావేశాల్లో విద్యుత్ ఉత్పత్తి రంగంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశాలు కల్పించే చట్టం తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీమా రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానించే నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. న్యూక్లియర్ లయబిలిటీ బిల్లు ద్వారా ప్రజలపై భారాలు మోపుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు జీవనోపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కేంద్రం తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ బిల్లు ఉపాధి కూలీల హక్కులను హరిస్తుందని, ఉపాధికి గ్యారంటీని తొలగిస్తుందని ఆరోపించారు. పథకంలోని మహాత్మా గాంధీ పేరును మార్చి జి రామ్జీ పేరుతో బిల్లు తేవడం ఎవరి ప్రయోజనాల కోసం అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం మోపి పథకం అమలును వాటిపై నెట్టివేస్తున్నారని, దాంతో ఉపాధి కూలీలు రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని అన్నారు. గత 12 ఏళ్లుగా ఉపాధి హామీ పథకానికి నిధుల కోతలు విధిస్తున్నారని విమర్శించారు.
కొత్త పథకం గ్రామీణ ఉపాధిని డిమాండ్ ఆధారిత హక్కుగా కాకుండా బడ్జెట్, నోటిఫికేషన్లు, టెక్నాలజీ వంటి ఆంక్షలపై ఆధారపడేలా చేస్తుందని తెలిపారు. ఇప్పటివరకు ఉపాధి హామీ చట్టబద్ధమైన హక్కుగా ఉండగా, కొత్త చట్టంతో పరిపాలనాధారిత విధానంగా మారుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా సగటున ఉపాధి కూలీలకు లభిస్తున్న పని దినాలు 51.6 రోజులకే పరిమితమని, 100 రోజుల పని పూర్తి చేసిన కుటుంబాలు 11 శాతం కూడా లేవని పేర్కొన్నారు. కొత్త చట్టం ప్రకారం ఉపాధి హామీ దేశవ్యాప్తంగా కాకుండా కేంద్రం నోటిఫై చేసిన ప్రాంతాలకే పరిమితమవుతుందని తెలిపారు.
ఈ నిర్ణయాలతో గ్రామీణ ప్రాంతాల్లోని వికలాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, ఆదివాసీలు, పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. కేంద్రం తెచ్చిన నూతన చట్టం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అన్నారు. నరేగా లోని హక్కుల ఆధారిత స్వభావాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సంస్థల్లో మతోన్మాద భావజాలాన్ని నింపుతోందని, రాజ్యాంగబద్ధ సంస్థలను జేబు సంస్థలుగా మార్చుకుంటోందని విమర్శించారు. మతాధారిత పరిపాలన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. లౌకిక దేశాన్ని హిందుత్వ ఆధారిత దేశంగా మార్చే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పెట్టుబడిదారులకు చౌకగా అమ్మివేస్తోందని, ప్రజల సంపదను కొద్ది మంది పెట్టుబడిదారులకు కట్టబెడుతోందని విమర్శించారు. ప్రభుత్వ సంస్థల్లో అమలవుతున్న రిజర్వేషన్లను రద్దు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన పెన్షన్ పెంపు హామీని అమలు చేయకుండా వికలాంగులను మోసం చేస్తోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 25 నెలలు గడిచినా హామీలు అమలు చేయకుండానే కొనసాగడం తగదన్నారు. పెన్షన్ పెంచకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్లేపల్లి స్వామి, జిల్లా కోశాధికారి కొత్త లలిత, బి. భగవంతు రెడ్డి, సంజీవ్, శంకర్, నాగు, నరసింహ, హరిబాబు, చందు, ఏ. గోపీ, మదన్ రావు తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube