దాత పసుమర్తి కృష్ణమూర్తి కన్నుమూత
దాత పసుమర్తి కృష్ణమూర్తి కన్నుమూత
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం: గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన ప్రముఖ దాత పసుమర్తి కృష్ణమూర్తి (97) బుధవారం వయోభారంతో తన పెద్ద కుమారుడు లక్ష్మణరావు నివాసంలో కన్నుమూశారు.
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు జీవితాన్ని అంకితం చేసిన కృష్ణమూర్తి, పెనుగొలను మెట్టగుట్ట ఆలయ ప్రాంగణంలో గజేంద్రమోక్షం, శివపార్వతులు, రథం, రాధాకృష్ణుల విగ్రహాలను స్వంత నిధులతో నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
అలాగే తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర సమీపంలోని ఆత్కూరు పరిధిలో ఉన్న పిల్లిగుట్ట వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణుని విశ్వరూప దర్శనం, శివపార్వతులు, లక్ష్మీదేవి తదితర విగ్రహాలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయా దేవాలయాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు.
కృష్ణమూర్తికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సేవా భావంతో గుర్తింపు పొందారు.
ఆయన మృతవార్త తెలుసుకున్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, గ్రామస్తులు భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన దాతృత్వాన్ని, ఆధ్యాత్మిక సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.