పెనుగొలను పాఠశాలలో డాక్టర్ కె.ఎల్. రావు జయంతి వేడుకలు
పెనుగొలను పాఠశాలలో డాక్టర్ కె.ఎల్. రావు జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో బుధవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో భారత జలవనరుల పితామహుడు, నాగార్జునసాగర్ రూపకర్త డాక్టర్ కె.ఎల్. రావు (కానూరి లక్ష్మణరావు) జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రధానోపాధ్యాయులు కొర్రపాటి యోహాను మాట్లాడుతూ, 1902 జూలై 15న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించిన కె.ఎల్. రావు భారతదేశంలోని అనేక భారీ ఆనకట్టల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన గొప్ప ఇంజనీర్ అని తెలిపారు. నాగార్జునసాగర్తో పాటు బక్రా నంగల్, ఫరక్కా, శ్రీశైలం వంటి ప్రముఖ ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన ప్రతిభ ప్రతిఫలించిందని పేర్కొన్నారు.
శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, కె.ఎల్. రావు విజయవాడ లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున 1962, 1967, 1971 ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారని చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ మంత్రివర్గాల్లో దాదాపు పదేళ్లపాటు కేంద్ర నీటిపారుదల, విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసి దేశాభివృద్ధికి విశేష సేవలు అందించారని వివరించారు.
కార్యక్రమంలో భాగంగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో పెన్నులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాన్వెంట్ ప్రిన్సిపాల్ తోట నాగరాజు, ఉపాధ్యాయులు కె. లీలా శంకర్, కే. సుజాత, ఎం. మాణిక్యం, జి. అలేఖ్య, విద్యార్థులు పాల్గొన్నారు.