దళితవాడలకు మౌలిక వసతులు కల్పించాలి: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం
ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలోని ఎస్సీ వాడలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని మండల పరిషత్ ఉపాధ్యక్షులు చాట్ల రాబర్ట్ శుక్రవారం కలెక్టర్ లక్ష్మిషాకు వినతిపత్రం సమర్పించారు. దళితవాడలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
రెడ్డిగూడెం దళితవాడ పెద్ద ప్రాంతమని, ప్రతి సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు, వరదల కారణంగా ఎస్సీ కుటుంబాలు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు. గతంలో వచ్చిన వరదలు దళితవాడను ముంచెత్తినా బాధితులకు సరైన నష్టపరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వరదల నుంచి రక్షణ కల్పించేందుకు కోతులవాగుకు పడమటిగూడెం నుంచి కొత్త కాలనీ వరకు సైడ్ వాల్ నిర్మించాలని, అలాగే పడమటిగూడెం సమీపంలోని పోతులవాగుపై ఉన్న వంతెనను పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా రెడ్డిగూడెం జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మించుకునేందుకు విద్యుత్, తాగునీటి వంటి మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే సదుపాయాలు కల్పించి పక్కా గృహాల నిర్మాణానికి సహకరించాలని కలెక్టర్ను కోరారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మల్లాది బాబు మాట్లాడుతూ, నూజివీడు నుంచి రెడ్డిగూడెం దళితవాడ మీదుగా గంపలగూడెం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గోతులమయంగా మారిందన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆ రహదారిని సీసీ రోడ్డుగా అభివృద్ధి చేయాలని వినతిపత్రంలో కోరారు.