దసరాలోగా స్థానిక ఎన్నికలు.. 45 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేలా సన్నాహాలు?
దసరాలోగా స్థానిక ఎన్నికలు.. 45 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేలా సన్నాహాలు?
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసినట్లు సమాచారం. దసరా నాటికి ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు 45 రోజుల్లో మున్సిపాలిటీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగించేలా రాష్ట్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి, అనంతరం జడ్పీ, మండల పరిషత్, చివరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే విధంగా షెడ్యూల్ రూపొందించే అవకాశం ఉందని సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ అక్టోబర్ 3 నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. కొత్త ఓటర్ల జాబితా విడుదలకు ముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కొత్త జాబితా వచ్చిన తర్వాత వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి ప్రక్రియలు చేపట్టాల్సి రావడంతో మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు ఇప్పటికే ముగియగా, జడ్పీ, మండల పరిషత్, మున్సిపాలిటీల పాలకవర్గాల గడువులు కూడా సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్లోనే ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, సామాజిక భద్రత పింఛన్ల అంశం కూడా స్థానిక ఎన్నికల నేపథ్యంలో చర్చనీయాంశంగా మారింది. కొత్తగా పింఛన్ల మంజూరు ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయంలో ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని, రెండో లేదా మూడో వారంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అనంతరం జడ్పీ, మండల పరిషత్ ఎన్నికలు, చివరగా పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఒక్కో ఎన్నికల ప్రక్రియకు సుమారు 20 రోజుల సమయం పట్టే అవకాశం ఉండటంతో అక్టోబర్ 15 నుంచి 20 మధ్యలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
అయితే పెంచిన బీసీ రిజర్వేషన్ల అంశం ఎన్నికల నిర్వహణకు సవాలుగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. న్యాయపరమైన సమస్యలు ఎదురైతే ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలు చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే సెప్టెంబర్లో స్థానిక ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.