డయాలసిస్ బాధితురాలికి రూ.10 వేల ఎన్టీఆర్ భరోసా పింఛన్
డయాలసిస్ బాధితురాలికి రూ.10 వేల ఎన్టీఆర్ భరోసా పింఛన్
ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మోరంపూడి శ్రీనివాసరావు
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చనుబండ శివారు కరుణాపురం గ్రామంలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డయాలసిస్ బాధితురాలు కొక్కెరగడ్డ కుమారికి కొత్తగా మంజూరైన నెలకు రూ.10 వేల ఎన్టీఆర్ భరోసా పింఛన్ను చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు, చీదిరాల మారేశ్వరరావు, నక్కా రాము అందజేశారు.
ఈ సందర్భంగా మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని అన్నారు. పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. డయాలసిస్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఎలాంటి సిఫార్సులు, రాజకీయ ప్రమేయం లేకుండానే ఆసుపత్రి ధృవీకరణ ఆధారంగా నెలకు రూ.10 వేల పింఛన్ మంజూరు చేయడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వ ప్రజాహిత పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని తెలిపారు.
నక్కా రాము, చీదిరాల మారేశ్వరరావు మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రతి నెలా ఒకటో తేదీన సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే వంద శాతం పింఛన్లు అందించే విధానాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. డయాలసిస్ బాధితులు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతర అర్హులైన లబ్ధిదారుల జీవనోపాధికి భరోసా కల్పించేలా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ఉపయోగపడుతోందన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కొక్కెరగడ్డ రత్తయ్య, కొక్కెరగడ్డ దివాకర్, వెల్ఫేర్ అసిస్టెంట్ బాబురావు, వీఆర్వో నాగరాజు, గ్రామస్థులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.