బెయిల్ కోసం రూ.10 లక్షల డిమాండ్..
బెయిల్ కోసం రూ.10 లక్షల డిమాండ్.. రూ.5 లక్షలు తీసుకుంటూ కీసర ఎస్సై అరెస్ట్
మేడ్చల్ జిల్లా: బెయిల్ మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన కీసర పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన పోలీసు వర్గాల్లో కలకలం రేపింది.
ఓ కేసులో నిందితుడికి బెయిల్ ఇప్పించేందుకు కీసర సీఐ ఆంజనేయులు రూ.10 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా బిర్యానీలు, కూల్డ్రింక్స్ తీసుకురావాలని నిందితుడిపై ఒత్తిడి చేసినట్లు సమాచారం. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్నారు. సీఐ ఆదేశాల మేరకు రూ.5 లక్షల లంచం తీసుకుంటున్న ఎస్సై జ్ఞానేందర్ రెడ్డిని కీసర చెరువుగట్టు వద్ద అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. అనంతరం సీఐ ఆంజనేయులును కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. లంచం డిమాండ్, స్వీకరణకు సంబంధించి పూర్తి వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది.