స్థానిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధం కావాలి: వైసీపీ అధినేత
స్థానిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధం కావాలి: వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో స్థానిక ఎన్నికల సన్నద్ధతపై ఆయన దిశానిర్దేశం చేశారు.
పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు సమావేశానికి హాజరయ్యారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేలా పార్టీ యంత్రాంగాన్ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని జగన్ సూచించారు.
బలమైన అభ్యర్థులను ఇప్పటి నుంచే ఎంపిక చేయాలి
స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నందున ప్రతి స్థానంలోనూ బలమైన అభ్యర్థులను గుర్తించాలని జగన్ సూచించారు. అభ్యర్థి స్థానికంగా ప్రజలతో మమేకమై ఉండటంతో పాటు పార్టీ కార్యకర్తలను కలుపుకుని ముందుకు వెళ్లే విధంగా ఉండాలని చెప్పారు. రిజర్వేషన్ల ఖరారు తర్వాత మార్పులు అవసరమైతే చేసుకోవచ్చని, అయితే అభ్యర్థుల ఎంపికను చివరి వరకు వాయిదా వేయడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.
ఎక్కడా ఏకగ్రీవ ఎన్నికలకు అవకాశం ఇవ్వకుండా పార్టీ తరఫున అభ్యర్థులను పోటీలో నిలపాలని సూచించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందనే నమ్మకాన్ని కల్పించాలని నేతలకు చెప్పారు.
ఇంటింటా ప్రచారానికి ప్రత్యేక కార్యాచరణ
స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో లీగల్సెల్, మీడియాసెల్ను ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు. సోషల్ మీడియా వేదికలను కూడా చురుకుగా వినియోగించుకోవాలని సూచించారు. పార్టీ కార్యకర్తలకు అవసరమైన శిక్షణ అందించి, సమాచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు.
ప్రతి గ్రామం, ప్రతి వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించాలని, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, సంస్కరణలను ప్రజలకు వివరించాలని సూచించారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పార్టీ చేస్తున్న విమర్శలను ప్రజలకు వివరించాలని చెప్పారు.
ఐదు అంశాలతో సంస్థాగత కార్యక్రమాలు
స్థానిక ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఐదు ప్రధాన అంశాలపై సంస్థాగత సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్సార్సీపీ చేస్తున్న విమర్శలను ప్రజల్లోకి తీసుకెళ్లడం
వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమం, సంస్కరణలను వివరించడం
పార్టీ క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేయడం
పార్టీ కార్యకర్తలకు గుర్తింపు కార్డుల పంపిణీ
మండల, గ్రామ, వార్డు స్థాయిలో ఇంటింటా ప్రచారం నిర్వహించడం
పార్టీ గుర్తింపు కార్డులు, ప్రచార సామగ్రిని జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇంటింటా ప్రచారంలో భాగంగా ‘వెన్నుపోటు పార్టీ.. వెన్నుపోటు పాలన’ పేరుతో రూపొందించిన బుక్లెట్ను పంపిణీ చేయనున్నట్లు సమావేశంలో తెలిపారు.
సెప్టెంబర్ 23 నుంచి ఇంటింటా ప్రచారం
సంస్థాగత సమావేశాల షెడ్యూల్ను కూడా ఖరారు చేశారు. సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు జిల్లా స్థాయి సమావేశాలు, సెప్టెంబర్ 8 నుంచి 11 వరకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు, సెప్టెంబర్ 12 నుంచి 22 వరకు మండల, వార్డు స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 23 నుంచి ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ప్రతి నియోజకవర్గంలో పార్టీ నేతలు, స్థానిక నాయకులు సమన్వయంతో పనిచేయాలని జగన్ సూచించారు. అభ్యర్థుల ఎంపికలో స్థానికంగా అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తులను గుర్తించి, సాధ్యమైనంత వరకు ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్దేశించారు.
ఎన్నికల వరకు నియోజకవర్గాల్లోనే పనిచేయాలి
స్థానిక ఎన్నికలు జరిగే వరకు పార్టీ నేతలు తమ నియోజకవర్గాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని జగన్ సూచించారు. గ్రామస్థాయి నుంచి పార్టీ సంస్థాగత వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు కార్యకర్తలు, నాయకులతో నిరంతరం సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. ప్రతి ఓటు కీలకమని, అహంకార ధోరణికి తావులేకుండా అందరినీ కలుపుకుని ముందుకు సాగాలని సూచించారు.
సమావేశంలో కూటమి ప్రభుత్వ పాలన, వైఎస్సార్సీపీ గత ఐదేళ్ల పాలన, సంక్షేమ కార్యక్రమాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామస్థాయి సేవలు తదితర అంశాలను ప్రస్తావిస్తూ జగన్ పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ సంస్థాగతంగా మరింత చురుగ్గా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.