ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలగకూడదు : ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం
NTODAY NEWS నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. సోమవారం నకిరేకల్ తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల ధాన్యం కొనుగోలుపై ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లి, నార్కట్పల్లి, చిట్యాల, రామన్నపేట మండలాల్లోని కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని, తేమ కొలిచే యంత్రాలు, తూకం మిషన్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నగదును 48 గంటల్లోపు రైతుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడంతో పాటు, ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులందరిపై ఉందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా పౌరసరఫరాల అధికారులు, వివిధ మండలాల తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ ఏడిలు , రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు, ఐకేపీ మరియు ప్యాక్స్ సిబ్బంది పాల్గొన్నారు.