ధర్మాజిగూడెం బాలికల హైస్కూల్లో పోలీసుల అవగాహన కార్యక్రమం
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి
ఏలూరు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో లింగపాలెం మండలం ధర్మాజిగూడెం బాలికల హైస్కూల్లో విద్యార్థినుల భద్రత, చట్టాలపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో, చింతలపూడి ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ధర్మాజిగూడెం ఎస్ఐ వెంకన్న సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా గుడ్ టచ్–బ్యాడ్ టచ్, లైంగిక వేధింపులు, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాలు, శక్తి యాప్, డయల్-112 సేవలు, స్వీయ రక్షణ పద్ధతులపై విద్యార్థినులకు సమగ్రంగా వివరించారు. మంచి స్పర్శ, చెడు స్పర్శ మధ్య తేడాను గుర్తించడం, ఈవ్టీజింగ్, ప్రేమ పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండడం, మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.
విద్యార్థినులు చదువుపై దృష్టి సారించి క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించిన పోలీసులు, ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే డయల్-112కు సమాచారం అందించాలని తెలిపారు. అలాగే పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో విద్యార్థినుల భద్రత కోసం శక్తి దళం సభ్యులు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.