ఎల్-నినో ప్రభావం నుంచి రైతులను కాపాడుకుంటాం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
ఎల్-నినో ప్రభావం నుంచి రైతులను కాపాడుకుంటాం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
ఉట్నూర్ (ఖానాపూర్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ సమావేశ మందిరంలో ఎల్-నినో (EL-NINO) ప్రభావ తీవ్రతను తగ్గించే ప్రత్యామ్నాయ కార్యచరణ ప్రణాళికపై ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. ఎల్-నినో వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను అధిగమించి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నీటి కొరత నివారణ, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను చైతన్యం చేయాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. పార్టీలకు అతీతంగా రైతులందరికీ అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే సందర్భంలో మున్సిపాలిటీల్లో నెలకొన్న వివిధ సమస్యలను సైతం తక్షణమే పరిష్కరించాలని అధికారులను కోరారు.
ఈ కీలక సమావేశంలో ఎల్-నినో ప్రభావంతో రానున్న నీటి కొరతను ఎదుర్కోవడం, రైతుల ప్రయోజనాలను కాపాడటం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ కె. ఇళంబరితి, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, అన్ని శాఖల అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు