ఎండల వేళ పిజిఆర్ఎస్కు వచ్చే ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి
వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పిజిఆర్ఎస్కు హాజరయ్యే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సూచించారు. ముఖ్యంగా నడవలేని వారు, మంచానికే పరిమితమైన వారు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పిజిఆర్ఎస్ కేంద్రాలకు తీసుకురావద్దని తెలిపారు. అలాంటి వారి సమస్యలను కుటుంబ సభ్యులు లేదా ప్రతినిధుల ద్వారా తెలియజేయవచ్చని పేర్కొన్నారు.
అర్జీదారులు తమ ఫిర్యాదులను అధికారిక వెబ్సైట్ meekosam.ap.gov.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అర్జీల స్థితి, పరిష్కార ప్రక్రియ లేదా ఇతర సమాచారం కోసం “మీకోసం” టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ 1100ను సంప్రదించాలని సూచించారు.
పిజిఆర్ఎస్కు హాజరయ్యే ప్రజల కోసం తాగునీరు, భోజనం వంటి సౌకర్యాలతో పాటు వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అందిన అర్జీలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు.