ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4 వేలకుపైగా క్రిమినల్ కేసులు పెండింగ్
దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల సంఖ్య భారీగా ఉన్నట్లు అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడైంది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై మొత్తం 4,192 క్రిమినల్ కేసులు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయని తెలిపింది.
ఈ కేసుల్లో 519 కేసులు పదేళ్లకు పైగా కొనసాగుతున్నాయని, మరో 754 కేసులు ఐదేళ్ల నుంచి పదేళ్ల మధ్య కాలంగా పెండింగ్లో ఉన్నాయని నివేదిక పేర్కొంది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల త్వరితగతిన విచారణకు సంబంధించి అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు 22వ నివేదికను సమర్పించారు.
నివేదిక ప్రకారం సిట్టింగ్ ఎంపీలపై 335 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉండగా, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై 1,222 కేసులు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీలకు సంబంధించిన 269 కేసులు, మాజీ ఎమ్మెల్యేలపై 1,339 కేసులు విచారణ దశలో ఉన్నాయి. మరో 700 కేసుల్లో దర్యాప్తు ఇంకా పూర్తికాలేదని, 360 కేసులు మూడేళ్లకు పైగా దర్యాప్తులోనే ఉన్నాయని వెల్లడించింది.
ఇదిలా ఉండగా లోక్సభలోని 543 మంది సభ్యుల్లో 251 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక చర్యలు అవసరమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.