హెడ్ పోస్టాఫీస్ జంక్షన్ నుంచి సీకేఎం ఆసుపత్రి మార్గంలో వరద నీరు
వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే పరిస్థితి.. ఆసుపత్రికి వెళ్లే గర్భిణులకు ఇబ్బందులు
వరంగల్ | Ntoday News
వరంగల్ హెడ్ పోస్టాఫీస్ జంక్షన్ నుంచి సీకేఎం ఆసుపత్రికి వెళ్లే ప్రధాన రహదారిపై మరోసారి వరద నీరు చేరింది. గత 24 గంటలుగా కురుస్తున్న వర్షాలతో రహదారి మొత్తం జలమయమై వాగును తలపిస్తోంది.
ఇటీవల కాలువల్లో చెత్త పేరుకుపోవడంతో మురుగునీరు సాఫీగా వెళ్లక రెండు రోజుల పాటు రోడ్డుపైనే నిలిచింది. తాజాగా వర్షపు నీరు కూడా కాలువల్లోకి వెళ్లే మార్గం లేక రోడ్డుపైకి చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా సీకేఎం ఆసుపత్రికి వెళ్లే గర్భిణులు, రోగులు, వారి సహాయకులు ఈ పరిస్థితితో అవస్థలు పడుతున్నారు. రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో ఆసుపత్రికి చేరుకోవడం కష్టంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షపు నీరు, మురుగునీరు రోడ్డుపై నిలవకుండా కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.