గాలివాన బాధితులకు రెడ్ క్రాస్ అండ.. తక్షణ సాయం అందించిన సేవా సంస్థలు
జగ్గయ్యపేట,ఇటీవల కురిసిన భారీ గాలివానతో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడం, పూరిళ్లు దెబ్బతినడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్టీసీ కాలనీ పేద కుటుంబాలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అండగా నిలిచింది. ఎన్టీఆర్ జిల్లా నిర్వహణ కమిటీ సభ్యుడు కర్లపాటి వెంకట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టి బాధిత కుటుంబాలకు తార్పాలిన్ పట్టాలు, నగదు సహాయం అందజేశారు.
స్థానిక వార్డు సభ్యులు, వార్తప్రభ దినపత్రిక రిపోర్టర్ గడ్డం రాంబాబు యాదవ్ విజ్ఞప్తి మేరకు స్పందించిన రెడ్ క్రాస్ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన కుటుంబాల పరిస్థితిని పరిశీలించింది. అనంతరం అత్యవసర సహాయంగా తార్పాలిన్లు పంపిణీ చేయడంతో పాటు ఆర్థిక సాయం అందించింది.
ఇల్లు తీవ్రంగా దెబ్బతిన్న ఉప్పె నాగరాజు కుటుంబానికి ఐదో వార్డు కౌన్సిలర్ వట్టెం మనోహర్ రూ.5,000, మానేపల్లి బ్రహ్మం రూ.1,000 అందించి మొత్తం రూ.6,000 సహాయం చేశారు. కె. వీరబాబు కుటుంబానికి లయన్స్ క్లబ్ తరఫున రూ.5,000, కాసర్ల వెంకమ్మ కుటుంబానికి కర్లపాటి చారిటబుల్ ట్రస్ట్ నుంచి రూ.2,000 ఆర్థిక సాయం అందించారు. షేక్ ఇమాం సాహెబ్ కుటుంబానికి కూడా ట్రస్ట్ తరఫున మరో నెలలో అదనంగా రూ.2,000 సాయం అందజేస్తామని కర్లపాటి వెంకట శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.
అదేవిధంగా కలిదిండు మల్లేశ్వరి, కొంకాల ఇందు, కాటుబోయిన ముత్తయ్య, షేక్ ఇమాం సాహెబ్, కాసర్ల వెంకమ్మ, కె. వీరబాబు, ఉప్పె నాగరాజు కుటుంబాలకు వర్షాల నుంచి రక్షణ కోసం తార్పాలిన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కర్లపాటి వెంకట శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు తక్షణ సహాయం అందించడం రెడ్ క్రాస్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్ అధ్యక్షుడు గొగుశెట్టి వెంకట మహేష్, మానేపల్లి బ్రహ్మం, గుండాల నారాయణరెడ్డి, కరుణాకర్, వట్టెం మనోహర్, గడ్డం రాంబాబు యాదవ్, స్వచ్ఛంద సేవకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.