గానుగపాడు–జి.కొత్తూరు ప్రధాన రహదారి నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతి
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: గానుగపాడు, జి.కొత్తూరు గ్రామాల మధ్య ప్రధాన రహదారి దెబ్బతిని పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు.
శ్రీరాంపురం–గానుగపాడు మీదుగా పేరువంచ వరకు రహదారి నిర్మాణం పూర్తయినప్పటికీ, గానుగపాడు–జి.కొత్తూరు గ్రామాల మధ్య రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయలేదని వారు తెలిపారు. అలాగే గానుగపాడు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం కూడా చేపట్టలేదని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో గానుగపాడు గ్రామంలో డబుల్ సీసీ రోడ్డు నిర్మించడంతో పాటు, గానుగపాడు–జి.కొత్తూరు గ్రామాల మధ్య ప్రధాన రహదారిని వెంటనే నిర్మించాలని కోరుతూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు కొత్తపల్లి వెంకట్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కోటా జమలయ్య, సీనియర్ నాయకుడు కొత్తపల్లి సత్యం, గ్రామ నాయకులు మేకల మాణిక్యరావు, కోట రాజశేఖర్, మేకల ఇనాక్రావు, గంజిబోయిన శ్రీను, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.