గోదావరి పుష్కరాలకు భారీగా ముందస్తు ఏర్పాట్లు: మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్
గోదావరి పుష్కరాలకు భారీగా ముందస్తు ఏర్పాట్లు: మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్
మంచిర్యాల:వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే భారీ స్థాయిలో ముందస్తు ఏర్పాట్లు ప్రారంభించిందని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు డీసీపీ భాస్కర్.. ఇతర అధికారులతో కలిసి లక్సెట్టిపేట, దండేపల్లి పరిధిలోని గూడెం దేవాలయం ఘాట్ వద్ద ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాలో మంచిర్యాల టౌన్ ఘాట్, గూడెం దేవాలయం ఘాట్, చెన్నూరు ఉత్తరవాహిని గోదావరి ఘాట్లను టైర్-1 (ప్రధాన) ఘాట్లుగా, లక్సెట్టిపేట ఘాట్ ను టైర్-2 గా, మరియు మరో పది ఘాట్లను టైర్-3 కింద గుర్తించినట్లు వెల్లడించారు. గోదావరి తీర ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించి, సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పుష్కరాల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించగా, డీజీపీ స్వయంగా ఘాట్లను పరిశీలించి భద్రత, వాచ్ టవర్ల నిర్మాణంపై కీలక సూచనలు చేశారు. లక్షలాదిగా వచ్చే భక్తుల రద్దీని నిరంతరం పర్యవేక్షించేందుకు కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ, సీసీటీవీ కెమెరాలు, అధునాతన వీడియో అనలిటిక్స్ సాంకేతికతను పోలీస్ శాఖ వినియోగించనుంది. ఏ మార్గం ద్వారా ఎంతమంది వస్తున్నారు, ఘాట్ సామర్థ్యం, ట్రాఫిక్ మళ్లింపు వంటి అంశాలపై ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, పరిశీలనలో గుర్తించిన అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి.. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పిస్తామని డీసీపీ వివరించారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో మండల రెవెన్యూ అధికారి, తహసీల్దార్, ఇరిగేషన్ శాఖ ఏఈ, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, సీఐ రమణమూర్తి, ఎస్ఐలు సురేష్, రాజవర్ధన్ తో పాటు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు