గురు పౌర్ణమి వేడుకల్లో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లకు ఘన సన్మానం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు కలిపి మొత్తం 10 మందిని ఘనంగా సన్మానించారు.
షిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లకు శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేసి వారి సేవలను కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర అమూల్యమని, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్ల సేవలు ఎంతో కీలకమని వక్తలు పేర్కొన్నారు.
గురువులకు సమాజంలో అత్యున్నత స్థానం ఉందని, వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమం ఆహూతులను ఆకట్టుకుంది.