గురుకులాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి: కలెక్టర్ చంద్రశేఖర్
గురుకులాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి: కలెక్టర్ చంద్రశేఖర్
రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం గుండ్లపల్లి (డిండి)లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ, డార్మిటరీ, కిచెన్, స్టోర్ రూమ్, వాష్రూమ్లను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల ఆవరణలో పేరుకుపోయే చెత్తను ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా తొలగించాలని పంచాయతీ కార్యదర్శి జంగయ్యను ఆదేశించారు. వాష్రూమ్లను నిరంతరం పరిశుభ్రంగా ఉంచడంతో పాటు వెంటనే తలుపులు ఏర్పాటు చేసి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సూచించారు.
పాఠశాలలో సివిల్ పనుల కోసం ప్రభుత్వం ఇటీవల రూ.26 లక్షలు మంజూరు చేసిందని కలెక్టర్ తెలిపారు. ఈ నిధులతో డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్, భవన మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని డీఈ శైలజను ఆదేశించారు.
అనంతరం స్టోర్ రూమ్ను పరిశీలించిన కలెక్టర్ స్టాక్ రిజిస్టర్ను తనిఖీ చేశారు. సరుకుల వివరాలను స్టాక్ రిజిస్టర్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, కాలం చెల్లిన సరుకులను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని స్పష్టం చేశారు. నెలకు అవసరమైన పరిమాణంలోనే సరుకులు తెప్పించుకోవాలని, విద్యార్థులకు తాజా కూరగాయలను అందించాలని ప్రిన్సిపల్ శిరీష, స్టోర్ కీపర్లకు సూచించారు.
వంట సరుకులను వృథా చేయకుండా రోజువారీ అవసరాలకు అనుగుణంగా మాత్రమే వినియోగించాలని తెలిపారు. వంట సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తప్పనిసరిగా చేతులకు గ్లౌజులు, తలకు కవర్లు ధరించాలని ఆదేశించారు. విద్యార్థినుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆత్మరక్షణలో భాగంగా వారికి కరాటే శిక్షణ ఇప్పించాలని ప్రిన్సిపల్ను ఆదేశించారు.
అనంతరం విద్యార్థినులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. వారి చదువు, పాఠశాలలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ గౌడ్, ఎంపీడీవో వైజన, సర్పంచ్ రవి తదితరులు పాల్గొన్నారు.