హైదరాబాద్లో పానీపూరీ తయారీ కేంద్రంపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడి.. 3,000 పానీపూరీలు ధ్వంసం
హైదరాబాద్లోని అత్తాపూర్ ప్రాంతంలో అపరిశుభ్ర పరిస్థితుల్లో పానీపూరీలు, సమోసాలు తయారు చేస్తున్న ఓ కేంద్రంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. తనిఖీల్లో కేంద్రం ఎలాంటి ఆహార భద్రతా లైసెన్స్ లేకుండానే నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
అధికారుల పరిశీలనలో పలుచోట్ల తీవ్ర నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి. వాడి నల్లగా మారిన వంటనూనెను మళ్లీ మళ్లీ ఉపయోగించడం, డ్రైనేజీ కాలువ పక్కనే ఆహార పదార్థాలు తయారు చేయడం, పరిశుభ్రత ప్రమాణాలను పూర్తిగా విస్మరించడం గుర్తించిన అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా సుమారు 3,000 పానీపూరీలు, 4 కిలోల సమోసాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అలాగే తయారీలో ఉపయోగిస్తున్న నూనె, మసాలాలు, ఇతర ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. నగరంలోని ఆహార తయారీ కేంద్రాలు, హోటళ్లు, వీధి ఆహార విక్రయ కేంద్రాలపై తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సూచించారు.