హైదరాబాద్లో ఉల్లి ధరలకు రెక్కలు.. కిలో రూ.80 దాటిన ధర!
తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిపాయల ధరలు మరోసారి సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు కిలో రూ.30 నుంచి రూ.50 వరకు ఉన్న ఉల్లి ధరలు ప్రస్తుతం ఏకంగా రూ.70–80కి చేరాయి. తెల్ల ఉల్లి ధర అయితే కిలో రూ.100 దాటడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్లోని మలక్పేట హోల్సేల్ మార్కెట్లో క్వింటా ఉల్లి రూ.4,500 నుంచి రూ.5,200 వరకు పలుకుతోంది. హోల్సేల్ మార్కెట్లోనే ధరలు భారీగా పెరగడంతో రిటైల్ మార్కెట్లో మరింత భారం పడుతోంది.
దిగుబడి తగ్గడంతోనే ధరల పెరుగుదల
మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో ఉల్లి దిగుబడి తగ్గడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు రావడం, పంట దిగుబడిపై ప్రభావం చూపినట్లు పేర్కొంటున్నారు.
మరోవైపు రవాణా ఖర్చులు, మార్కెట్లో సరఫరా తగ్గడం కూడా ధరల పెరుగుదలకు తోడవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్థానికంగా కొత్త ఉల్లి పంట మార్కెట్కు వచ్చే వరకు ధరలు పెద్దగా తగ్గే అవకాశం లేదని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఉల్లి ధరలు ఇలా పెరగడంతో వంటింటి బడ్జెట్పై అదనపు భారం పడుతోంది. ఇప్పటికే కూరగాయల ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉల్లి ధరల పెరుగుదల మరింత భారంగా మారింది.