ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన విధానంలో మార్పులు రానున్నాయి. ఇకపై ఒక పాఠశాల విద్యార్థుల జవాబు పత్రాలను అదే పాఠశాల ఉపాధ్యాయులు కాకుండా ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో దిద్దించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
1 నుంచి 9వ తరగతి వరకు నిర్వహించే ఎస్ఏ-1, ఎస్ఏ-2 పరీక్షలు, పదో తరగతి ఎస్ఏ-1 పరీక్షల జవాబు పత్రాలకు ఈ విధానం వర్తించనుంది. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, మూల్యాంకనంలో పారదర్శకత తీసుకురావడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
మండల విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో మండల కేంద్రాల్లో ప్రత్యేక మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆయా కేంద్రాల్లో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు జవాబు పత్రాలను పరిశీలించనున్నారు. ఈ విధానం ద్వారా విద్యార్థుల ప్రతిభను మరింత కచ్చితంగా అంచనా వేయవచ్చని విద్యాశాఖ భావిస్తోంది.