జీవో 396 రద్దు చేయాలంటూ దస్తావేజు లేఖర్ల ఆందోళన ఉధృతం
అర్ధనగ్న ప్రదర్శనతో ప్రభుత్వానికి హెచ్చరిక
మదనపల్లి, జూలై 7: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖర్లు, వారి సహాయకులు ఆందోళనను ఉధృతం చేశారు. గత ఆరు రోజులుగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నిరసనలు కొనసాగిస్తున్న వారు మంగళవారం అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి ప్రభుత్వానికి నిరసన సందేశం పంపారు.
జీవో 396 అమలుతో రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖర్ల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది మంది దస్తావేజు లేఖర్లు, వారి సహాయకుల కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదంలో ఉన్నాయని తెలిపారు.
ఈ వృత్తిపై ఆధారపడిన కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంతో పాటు అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని హెచ్చరించారు.
దస్తావేజు లేఖర్ల సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కంగేరి నంద ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో దస్తావేజు లేఖర్లు రాజేంద్ర, ఇమ్రాన్ భాష, కుళ్లాయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.