నాణ్యత లేని ఆహారంపై ఆగ్రహం.. గడువు ముగిసిన నూనె ప్యాకెట్ల స్వాధీనం
విద్యార్థులు, చిన్నారులకు నాణ్యమైన ఆహారమే అందించాలి: రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు గంజమల దేవి
అన్నమయ్య జిల్లా, జూలై 7: రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు గంజమల దేవి మంగళవారం అన్నమయ్య జిల్లాలో విస్తృతంగా పర్యటించి అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాసంస్థలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ చౌక దుకాణాలు, ఎంఎల్ఎస్ పాయింట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
వాల్మీకిపురం అంగన్వాడీ కేంద్రంలో కోడిగుడ్ల నాణ్యతను స్వయంగా పరిశీలించిన ఆమె, ప్రమాణాలకు అనుగుణంగా లేని గుడ్లను గుర్తించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు అందించే ఆహార పదార్థాల విషయంలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు.
గుర్రంకొండ రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో గడువు ముగిసిన వంటనూనె ప్యాకెట్లు గుర్తించిన గంజమల దేవి, వాటిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
చింతపర్తి జడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా రుచి చూసిన ఆమె, భోజనం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కలికిరి, పీలేరు ప్రాంతాల్లోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, ఎంఎల్ఎస్ పాయింట్లు, ప్రభుత్వ చౌక దుకాణాలను తనిఖీ చేసి విద్యార్థులు, చిన్నారులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.