జీవో 396పై దస్తావేజుల లేఖరుల గళం.. విసన్నపేటలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఆందోళన
జీవో 396పై దస్తావేజుల లేఖరుల గళం.. విసన్నపేటలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఆందోళన
విసన్నపేట, జూలై 20: రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన జీవో నెం. 396ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో దస్తావేజుల లేఖరులు, లేఖరి సహాయకులు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంప్ విక్రేతలు సోమవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించిన వారు, అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సబ్ రిజిస్ట్రార్ ఆళ్ళ నాగమోహన్కు అందజేశారు.
ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ, జీవో 396 అమలుతో దశాబ్దాలుగా ప్రజలకు సేవలందిస్తున్న దస్తావేజుల లేఖరుల వృత్తి తీవ్ర సంక్షోభంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల వేలాది కుటుంబాల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. లేఖరుల వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ఈ జీవో ఉందని ఆరోపిస్తూ, ప్రభుత్వం వెంటనే దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
లేఖరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన కొత్త విధానాన్ని రూపొందించాలని కోరారు. జీవో 396 రద్దు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన సబ్ రిజిస్ట్రార్ ఆళ్ళ నాగమోహన్, వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమంలో కోస్థాల రామకృష్ణ, పోతుల శ్రీనివాసరావు, గోనెల దిలీప్ కుమార్, తేనెల సాయి కుమార్, అబ్బినేని రమేష్, మహేష్, నెలపట్ల నరేంద్రతో పాటు పలువురు దస్తావేజుల లేఖరులు, లేఖరి సహాయకులు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంప్ విక్రేతలు పాల్గొన్నారు.