జగన్ నువ్వు చేసిందేంటి.. మర్చిపోయావా? - ఎమ్మెల్సీ వర్ల రామయ్య
జగన్ నువ్వు చేసిందేంటి.. మర్చిపోయావా? - ఎమ్మెల్సీ వర్ల రామయ్య
- స్థానిక ఎన్నికలపై జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేత విమర్శలు
విజయవాడ: పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పార్టీ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని ఎమ్మెల్సీ వర్ల రామయ్య విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రజలు ఇంకా మర్చిపోలేదని ఆయన అన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ఒక్క పంచాయతీ కూడా ఏకగ్రీవం కాకూడదని, ఎవరైనా ఏకగ్రీవం చేస్తే భవిష్యత్తులో అసెంబ్లీ టికెట్ ఇవ్వనని జగన్ సొంత పార్టీ నాయకులను హెచ్చరించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ఎవరు గెలవాలి.. ఎవరు ఓడాలి అనేది ప్రజలే నిర్ణయించాలని, పార్టీ అధినేతలు బెదిరింపులతో నిర్ణయించే పరిస్థితి ఉండకూడదని వర్ల రామయ్య అన్నారు. ఏకగ్రీవాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా గ్రామస్థాయిలో ప్రజల నిర్ణయాధికారాన్ని, నాయకుల స్వేచ్ఛను జగన్ ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆరోపించారు.
గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్షాలపై ఎలాంటి ఒత్తిళ్లు, ఇబ్బందులు పెట్టారో ప్రజలకు తెలుసని అన్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల తీర్పే అంతిమమని, ఎవరి బెదిరింపులకు ప్రజలు భయపడరని వర్ల రామయ్య పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగితేనే ప్రజాస్వామ్యానికి బలం చేకూరుతుందని అన్నారు.