మధిరలో కేబుల్ ఆపరేటర్లతో విద్యుత్ శాఖ కీలక సమావేశం
మధిరలో కేబుల్ ఆపరేటర్లతో విద్యుత్ శాఖ కీలక సమావేశం
అండర్ గ్రౌండ్ విద్యుత్ పనుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచన
మధిర: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఇంటర్నెట్, సిటీ కేబుల్ ఆపరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బుధవారం మధిర విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఏడీఈ ఎం. అనురాధ అధ్యక్షత వహించారు.
మధిర పట్టణంలో అత్యాధునిక సౌకర్యాలతో అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా విద్యుత్ సరఫరా అందించే పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఏడీఈ తెలిపారు. పనులు పూర్తయిన అనంతరం ప్రస్తుతం ఉన్న విద్యుత్ స్తంభాలను దశలవారీగా తొలగించనున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం పట్టణంలో ఇంటర్నెట్ కేబుల్స్, సిటీ కేబుల్స్ విద్యుత్ స్తంభాలను ఆధారంగా చేసుకొని ప్రజలకు సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. విద్యుత్ స్తంభాల తొలగింపు నేపథ్యంలో కేబుల్ ఆపరేటర్లు ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
అండర్ గ్రౌండ్ విద్యుత్ పనులు పూర్తయిన వెంటనే యూజీ కేబుల్ వ్యవస్థ ద్వారా వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఏడీఈ అనురాధ వెల్లడించారు.
ఈ సమావేశంలో మధిర పట్టణ విద్యుత్ శాఖ ఏఈ ఎస్. అనిల్ కుమార్, పట్టణంలోని ఇంటర్నెట్ మరియు సిటీ కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు.