తిరువూరులో బీఎస్పీ ముఖ్య కార్యకర్తల సమావేశం..
తిరువూరులో బీఎస్పీ ముఖ్య కార్యకర్తల సమావేశం.. స్థానిక ఎన్నికలపై వ్యూహ రచన
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు:
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రధాన అంశంగా చేసుకుని బహుజన్ సమాజ్ పార్టీ తిరువూరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. నియోజకవర్గ అధ్యక్షులు ప్రత్తిపాటి మల్లయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పరాజు, రాష్ట్ర కార్యదర్శులు శామ్యూల్ కుమార్, గంగవరపు దేవా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పరాజు మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజల్లోకి పార్టీ విధానాలను తీసుకెళ్లే విధానాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర కార్యదర్శి శామ్యూల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, వారికి మద్దతుగా నిలిచే నాయకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు చురుకుగా పనిచేయాలని సూచించారు.
తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర కార్యదర్శి గంగవరపు దేవా మాట్లాడుతూ క్రైస్తవులు, పాస్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ వారి సమస్యల పరిష్కారానికి బీఎస్పీ అండగా ఉంటుందని తెలిపారు.
జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ పార్టీ ఏ ఒక్కరి కృషితో ముందుకు సాగదని, ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా పనిచేసినప్పుడే పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.
ఈ సందర్భంగా తంగెళ్లబీడు గ్రామానికి చెందిన ముస్లిం నాయకుడు షేక్ రసూల్కు పార్టీ కండువా కప్పి బీఎస్పీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఏ.కొండూరు అధ్యక్షులు నాగరాజు, గంపలగూడెం అధ్యక్షులు వెంకట్రావు, కోటేశ్వరరావు, రసూల్, కుమారి, ఏసుపాదం, సురేష్, వెంకటేశ్వరరావు, రావూరి రమేష్, ఆదూరి కోటయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.
చివరగా నియోజకవర్గ అధ్యక్షులు ప్రత్తిపాటి మల్లయ్య వందన సమర్పణతో సమావేశం ముగిసింది.