తెనాలి: గంజాయి అక్రమ రవాణా కేసులో నలుగురు అరెస్ట్..
తెనాలి: గంజాయి అక్రమ రవాణా కేసులో నలుగురు అరెస్ట్.. కిలోకు పైగా మత్తు పదార్థం స్వాధీనం
రూ.17 వేల విలువైన 1.050 కిలోల గంజాయి స్వాధీనం.. మరో నిందితుడు పరారీ
గుంటూరు జిల్లా తెనాలి పరిధిలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, నిల్వలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తెనాలి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1 కిలో 50 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.17 వేలుగా పోలీసులు అంచనా వేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. తెనాలి రెండో పట్టణ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రత్యేక బృందం వడ్డేశ్వరం గ్రామంలోని కేఎల్ యూనివర్సిటీ ఎదురుగా ఉన్న వంతెన వద్ద నిఘా ఏర్పాటు చేసింది. ఈ సమయంలో ఐదుగురు వ్యక్తులు ప్లాస్టిక్ కవర్లలో గంజాయి కలిగి ఉండగా పోలీసులు గుర్తించారు. పోలీసులను చూసిన ఒకరు అక్కడి నుంచి పరారయ్యాడు. మిగిలిన నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు.
అరెస్ట్ చేసిన వారిలో తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామానికి చెందిన మల్లవరపు పృథ్వి (25), వడ్డేశ్వరానికి చెందిన షేక్ బాజీ బాబా (25), కొలనుకొండకు చెందిన కవల ఉపేంద్ర సింగ్ (55), తాడేపల్లి మండలం కొలనుకొండ రైల్వే గేట్ ప్రాంతానికి చెందిన నల్లపు ప్రదీప్ కుమార్ (22) ఉన్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో గతంలోనే కట్టేవరం గ్రామానికి చెందిన నీలకంఠం కృష్ణమూర్తి (21), కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన నీలకంఠం ప్రభుకుమార్ (22)లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కూడా గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో ప్రధాన నిందితుడు మల్లవరపు పృథ్వి 2025 ఫిబ్రవరిలో అరకు ప్రాంతం నుంచి గుర్తుతెలియని వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి తీసుకువచ్చినట్లు వెల్లడైంది. అందులో కొంత భాగాన్ని గతంలో అరెస్ట్ అయిన నిందితులకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి పృథ్వి పరారీలో ఉండగా, తాజాగా మరో ముగ్గురితో కలిసి పోలీసులకు పట్టుబడ్డాడు.
నిందితులు గంజాయిని వినియోగించడంతో పాటు పృథ్వి వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. నిషేధిత మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు తెనాలి ఎస్డీపీఓ పర్యవేక్షణలో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి లేదా ఇతర డ్రగ్స్కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని జిల్లా పోలీసులు ప్రజలకు సూచించారు.