హైదరాబాద్: సెల్ఫోన్ చోరీలతో బ్యాంకు ఖాతాలు ఖాళీ..
హైదరాబాద్: సెల్ఫోన్ చోరీలతో బ్యాంకు ఖాతాలు ఖాళీ.. ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై అప్రమత్తంగా ఉండాలి: సీపీ సజ్జనర్
హైదరాబాద్: సాంప్రదాయ జేబుదొంగతనాలకు సైబర్ నేరాలను జోడించి అమాయకుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న కొత్త తరహా ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’ ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధులు, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ముఠాలు పక్కా ప్రణాళికతో నేరాలకు పాల్పడుతున్నాయని తెలిపారు.
ఈ తరహా నేరాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు.
నేరగాళ్లు మొదట బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే ఆర్టీసీ బస్సులు, బహిరంగ ప్రదేశాల్లో మొబైల్ ఫోన్లు వినియోగించే వారిని గుర్తిస్తారు. బాధితులు ఫోన్ అన్లాక్ చేసే సమయంలో స్క్రీన్ లాక్ నమూనా, పిన్, పాస్వర్డ్లను గమనించి, తర్వాత అదును చూసి మొబైల్ ఫోన్లను చోరీ చేస్తున్నారు.
ఫోన్ లాక్ తెలియకపోతే కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. బాధితులు పోయిన ఫోన్కు కాల్ చేసినప్పుడు తాము బస్సు కండక్టర్ లేదా డ్రైవర్ అని చెప్పి, ఫోన్ దొరికిందని నమ్మిస్తున్నారు. వివరాలు సరిచూసుకోవాలనే పేరుతో స్క్రీన్ లాక్ పిన్, పాస్వర్డ్లను బాధితుల నుంచే రాబడుతున్నారు.
ఫోన్ అన్లాక్ అయిన వెంటనే గ్యాలరీ, నోట్స్, మెసేజ్లు, వాట్సాప్ చాట్లలో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డుల చిత్రాలు, ఆధార్, పాన్ వివరాలు, బ్యాంకు సమాచారం, యూపీఐ పిన్లను ఉపయోగించి బ్యాంకు ఖాతాల నుంచి నగదును క్షణాల్లో మళ్లిస్తున్నారు.
నేరగాళ్లు నేరుగా తమ ఖాతాల్లోకి డబ్బులు తీసుకోకుండా ఆన్లైన్ గేమింగ్ వేదికలు, డిజిటల్ వాలెట్లు, ఇతరుల పేర్లతో తెరిచిన ఖాతాల ద్వారా నగదును మళ్లించి చివరకు విత్డ్రా చేసుకుంటున్నారని పోలీసులు గుర్తించారు.
ఇది సాధారణ మొబైల్ చోరీ కాదని, పలు విభాగాలతో పనిచేసే వ్యవస్థీకృత సైబర్ నెట్వర్క్ అని సీపీ తెలిపారు. బాధితులను గుర్తించే వారు, ఫోన్లు చోరీ చేసే వారు, పాస్వర్డ్లు రాబట్టే వారు, బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించే సాంకేతిక నిపుణులు వేర్వేరుగా పనిచేస్తున్నారని వివరించారు.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఫోన్ పోయినప్పుడు ఎవరైనా తిరిగి ఇస్తామని చెప్పినా మొబైల్ స్క్రీన్ లాక్ పిన్, పాస్వర్డ్, ఓటీపీ వివరాలను చెప్పకూడదు.
ఏటీఎం కార్డు ఫొటోలు, సీవీవీ నంబర్లు, బ్యాంకు పాస్వర్డ్లు, ఆధార్, పాన్ వివరాలను మొబైల్లో భద్రపరచకూడదు.
ఫోన్ పోయిన వెంటనే సిమ్ కార్డును బ్లాక్ చేయించాలి.
బ్యాంకును సంప్రదించి నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలి.
మొబైల్ పోర్టల్ ద్వారా ఐఎంఈఐ నంబర్ నమోదు చేసి ఫోన్ను బ్లాక్ చేయించాలి.
డబ్బులు పోయినట్లు గుర్తిస్తే వెంటనే 1930 సైబర్ హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలి.
కుటుంబాల్లోని యువత తమ ఇంట్లోని వృద్ధులకు ఈ తరహా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని, ప్రయాణ సమయంలో మొబైల్ వినియోగంలో జాగ్రత్తలు పాటించేలా చూడాలని సీపీ సజ్జనర్ సూచించారు.