నూజివీడు మండలంలో పెద్దపులి కలకలం..
నూజివీడు మండలంలో పెద్దపులి కలకలం.. రంగంలోకి దిగిన అటవీశాఖ
ముక్కొల్లుపాడు గొల్లగూడెం ప్రాంతంలో పులి సంచరిస్తుందంటూ గ్రామస్తుల సమాచారం.. డ్రోన్తో పరిశీలన
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నూజివీడు మండలం ముక్కొల్లుపాడు గ్రామం గొల్లగూడెం ప్రాంతంలో పెద్దపులి సంచారం ఉందంటూ వచ్చిన సమాచారంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. ఓ పులి రెండు పిల్లలతో కలిసి ప్రాంతంలో తిరుగుతున్నట్లు కొందరు గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ రేంజర్ అధికారి సత్యనారాయణ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనుమానిత ప్రాంతాలను పరిశీలించి డ్రోన్ కెమెరాల ద్వారా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే పరిశీలనలో ఇప్పటివరకు ఎలాంటి పులి ఆనవాళ్లు, పాదముద్రలు లేదా కదలికలు గుర్తించలేదని రేంజర్ అధికారి తెలిపారు. ప్రజలు పుకార్లను నమ్మి భయాందోళనకు గురికావద్దని సూచించారు.
ఎవరైనా నిజంగా పులి సంచారాన్ని గమనించినా, జాడలు కనిపించినా వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రేంజర్ అధికారి సత్యనారాయణ హెచ్చరించారు.