జిల్లాలోని ఎస్.సి. న్యాయ శాస్త్ర పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవాలి
జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్
మంచిర్యాల: జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ) చెందిన న్యాయ శాస్త్ర పట్టభద్రులకు శిక్షణ భృతి, ఇతర సదుపాయాల కల్పనకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 సంవత్సరానికి గాను 39 ఏళ్ల లోపు వయసున్న అర్హులైన ఎస్సీ లా గ్రాడ్యుయేట్లను ఎంపిక చేసి, న్యాయ పరిపాలనలో శిక్షణ నిమిత్తం మూడు సంవత్సరాల పాటు జిల్లాలోని లా అధికారులకు అటాచ్ చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలకు రూ. 3,000 చొప్పున శిక్షణ భృతి అందించడంతో పాటు.. న్యాయ శాస్త్ర గ్రంథాలు, ఫర్నిచర్ కొనుగోలు నిమిత్తం ఒకేసారి రూ. 50,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బార్ అసోసియేషన్లో తప్పనిసరిగా సభ్యులై ఉండాలి. అలాగే అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంత వాసులైతే రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంత వాసులైతే రూ. 2 లక్షల లోపు ఉండాలి. అర్హత గల వారు జూలై 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా 'తెలంగాణ ఈ-పాస్' (https://telanganaepass.cgg.gov.in) వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో మీ-సేవా ద్వారా జారీ చేసిన ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేయాలి. అనంతరం ఆన్లైన్ దరఖాస్తు ప్రింటవుట్ను, సంబంధిత ధ్రువపత్రాలను సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం (IDOC)లోని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో అందజేయాలని, ఇతర వివరాలకు పనివేళల్లో తమ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని ఆయన సూచించారు