జింకలపాలెం పాఠశాలలో ముందస్తు గురుపౌర్ణమి వేడుకలు.. గురువులకు ఘన సన్మానం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామపంచాయతీ శివారు జింకలపాలెంలోని ఉర్దూ, తెలుగు మాధ్యమ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ముందస్తు గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాస మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పాఠశాల ఉపాధ్యాయులు షేక్ షెహనాజ్ బేగం, ఎన్. బద్రీనాథ్, కే. నరేష్ బాబు, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు షేక్ మీరాబీలను శిరిడీ సాయిబాబా సేవా కమిటీ సభ్యులు, విద్యార్థులు శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
సభలో సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, అజ్ఞానమనే చీకటి నుంచి జ్ఞానమనే వెలుగువైపు నడిపించేవారు గురువులని అన్నారు. తల్లిదండ్రులు తొలి గురువులైతే, పాఠశాలలో విద్యతో పాటు నైతిక విలువలు, జీవిత సత్యాలను బోధించే ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తారని పేర్కొన్నారు.
ఉర్దూ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షేక్ షెహనాజ్ బేగం మాట్లాడుతూ, తమను సన్మానించిన సాయిబాబా సేవా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. తాము బోధించిన విద్యార్థులు ఉన్నత స్థితికి చేరుకోవడం కంటే ఉపాధ్యాయులకు మరింత ఆనందం మరొకటి ఉండదన్నారు.
కాన్వెంట్ ప్రిన్సిపాల్ తోట నాగరాజు మాట్లాడుతూ, భారతదేశంలో గురువులను గౌరవించడం గొప్ప సంప్రదాయమని, విద్యను బోధించే గురువులకు కులం, మతం అనే భేదాలు ఉండవని, జ్ఞానాన్ని పంచడమే గురువు ప్రధాన ధ్యేయమని అన్నారు.
అనంతరం శిరిడీ సాయిబాబా సేవా కమిటీ సభ్యులు విద్యార్థులకు పెన్నులు, మిఠాయిలు పంపిణీ చేశారు.