జలధారతో జలకళ సంతరించుకున్న ఏపీ పల్లెలు.. కరవు నేలల్లో పచ్చని విప్లవం!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘జలధార ప్రాజెక్ట్’ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చేస్తోంది. ఒకప్పుడు నీటి కొరతతో అల్లాడిన పల్లెలు నేడు జలసిరులతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా కరవు బారిన పడిన అన్నమయ్య జిల్లా దుబిగన్పల్లి, ప్రకాశం జిల్లా మురుగుమ్మి, మారెళ్ల, తాంగేళ్ల గ్రామాల్లో ఈ ప్రాజెక్ట్ ఆశాజ్యోతి నింపింది.
స్థానిక ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన నీటి సంరక్షణ చర్యలు విశేష ఫలితాలు ఇస్తున్నాయి. ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ప్రాంతాల్లో చేపట్టిన 195 నీటి సంరక్షణ పనుల ద్వారా సుమారు 24 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఏర్పడింది. దీంతో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగి, దాదాపు 5,900 మంది గ్రామస్తులు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతున్నారు.
పొలాలకు సమృద్ధిగా సాగునీరు అందడంతో పంటలు పచ్చగా పెరుగుతుండగా, పశువులకు కూడా తాగునీటి సమస్య తీరింది. ఒకప్పుడు ఎండిపోయిన బోర్లు, వెలవెలబోయిన చెరువులు కనిపించిన ప్రాంతాల్లో ఇప్పుడు నీటి నిల్వలు నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుండగా, వ్యవసాయ రంగం కొత్త ఊపుతో ముందుకు సాగుతోంది.
జలధార ప్రాజెక్ట్తో కరవు నేలలు సస్యశ్యామలంగా మారి, ఏపీ పల్లెలు పచ్చదనంతో కొత్త చరిత్ర రాస్తున్నాయి.