కె.కోటపాడు: 5 సెంట్ల భూమికి రూ.20 వేల లంచం!
రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. వీఆర్వో రెడ్హ్యాండెడ్గా పట్టివేత
అనకాపల్లి జిల్లా, కె.కోటపాడు:
ముఖ్యమంత్రి పదేపదే హెచ్చరిస్తున్నా రెవెన్యూ వ్యవస్థలో అవినీతి తగ్గడం లేదనే ఆరోపణలకు తాజా ఘటన అద్దం పడుతోంది. కేవలం 5 సెంట్ల భూమికి 1బీ జారీ చేసేందుకు రూ.20 వేల లంచం డిమాండ్ చేసిన ఘటన కె.కోటపాడు తహసీల్దార్ కార్యాలయంలో కలకలం రేపింది.
వారాడ గ్రామానికి చెందిన రైతుకు 5 సెంట్ల భూమికి సంబంధించిన 1బీ జారీ చేయడానికి వీఆర్వో గిడుతూరి సూర్యనారాయణ రూ.20 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు సమాచారం.
ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు కె.కోటపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్వోను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు సమాచారం. అనంతరం కార్యాలయంలో సోదాలు నిర్వహించి పలు వివరాలను పరిశీలించినట్లు తెలుస్తోంది.
రైతుల భూములకు సంబంధించిన చిన్నచిన్న పనులకు సైతం లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ శాఖలో అవినీతికి అడ్డుకట్ట వేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారడం లేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.