కళాకారులకు తోడు నిలవడం కూడా ఒక గొప్ప కళే
కళాకారులకు తోడు నిలవడం కూడా ఒక గొప్ప కళే – వై.వి.బి. రాజేంద్రప్రసాద్
ఉయ్యూరు లో నిర్వహించిన పరుచూరి రఘుబాబు స్మారక 36వ అఖిల భారత నాటక పోటీలు కళా వేదికగా మెరిశాయి. స్థానిక శ్రీనివాస గ్రావిటీ విద్యాసంస్థల ప్రాంగణంలో పరుచూరి శ్రీనివాసరావు, నీలిమ దంపతులు, పరుచూరి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై కళల ప్రాముఖ్యతపై హృదయాన్ని హత్తుకునేలా మాట్లాడారు.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కళలు, కవులు సమాజానికి మార్గదర్శకులని పేర్కొన్నారు. కళ అనేది మనిషి భావాలను రూపాల్లోకి తీసుకువచ్చే సృజనాత్మక ప్రక్రియ కాగా, కవిత్వం భావాలకు అక్షరరూపం ఇచ్చే శక్తివంతమైన సాధనమని వివరించారు. ఈ రెండింటి ద్వారా మనిషి అంతర్ముఖ ప్రపంచం వెలుగులోకి వస్తుందని, అలాంటి ప్రతిభలను వెలికితీయడం, ప్రోత్సహించడం కూడా ఒక గొప్ప కళేనని స్పష్టం చేశారు.
అలాగే ఉయ్యూరు నుంచి ఎదిగి తెలుగు సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన పరుచూరి వెంకటేశ్వరరావు పరుచూరి గోపాలకృష్ణ సోదరుల సేవలను గుర్తుచేశారు. రచయితలుగా, సంభాషణల కర్తలుగా, దర్శకులుగా, నటులుగా అనేక రంగాల్లో మూడు దశాబ్దాలుగా వారు చేసిన సేవలు ప్రశంసనీయమని తెలిపారు. వారి తనయుడు రఘుబాబు స్మారకార్థం గత 36 ఏళ్లుగా నాటక పోటీలు నిర్వహిస్తూ కళలకు సేవ చేస్తున్నందుకు పరుచూరి బ్రదర్స్ను అభినందించారు.
ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పరుచూరి శ్రీనివాసరావు, నీలిమ దంపతులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు, పరుచూరి రఘుబాబు మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ పరుచూరి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు, శ్రీనివాస విద్యాసంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, కవులు, కళాకారులు పాల్గొని కార్యక్రమాన్ని మరింత వైభవంగా మార్చారు.