కొల్లేరులో అక్రమ చెరువుల ముసుగులో కూలీల కన్నీరు..!
కొల్లేరులో అక్రమ చెరువుల ముసుగులో కూలీల కన్నీరు..!
అక్రమ చెరువులు.. అడ్డగోలు వ్యవహారాలు..!
కొల్లేరు ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న చేపల చెరువుల వ్యవహారం మరోసారి వివాదానికి దారితీసింది. పని చేయించుకుని కూలీలకు కూలీ చెల్లించకుండా తప్పించుకుంటున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
మూడు రోజులుగా కూలీ డబ్బులు ఇవ్వాలని కోరుతూ బాధిత కూలీలు సంబంధిత యజమానుల గేటు ముందు పడిగాపులు కాస్తున్నా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు. కూలీ అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని, “ఎక్కడైనా వెళ్లి చెప్పుకోండి” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని కూలీలు ఆరోపిస్తున్నారు.
ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ చెరువుల వ్యవహారంపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కూడా మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
పని చేయించుకుని చేతులు దులుపుకున్న యజమానులపై వెంటనే చర్యలు తీసుకుని తమకు రావాల్సిన కూలీ డబ్బులు ఇప్పించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇదిలా ఉండగా, కొల్లేరు అక్రమ చెరువుల వెనుక జరుగుతున్న అసలు వ్యవహారమేంటనే దానిపై కూడా స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ వివాదం మరోసారి పెద్దల వద్దకు చేరినట్లు సమాచారం. కూలీలకు న్యాయం జరిగేలా అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.