పిడిఎస్ బియ్యం అక్రమ రవాణాపై రౌడీషీటర్కు పీడీ యాక్ట్
కృష్ణా జిల్లా పోలీసుల కఠిన చర్యలు పిడిఎస్ బియ్యం అక్రమ రవాణాపై రౌడీషీటర్కు పీడీ యాక్ట్
కృష్ణా జిల్లా: పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ అక్రమంగా విక్రయిస్తున్న రౌడీషీటర్పై కృష్ణా జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. పామర్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని పామర్రు గ్రామానికి చెందిన గొట్టపు రమేష్ (తండ్రి: రామకృష్ణ) అనే వ్యక్తి పిడిఎస్ బియ్యాన్ని ఇతర మార్కెట్లలో విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నట్లు గుర్తించారు.
ఇప్పటివరకు గన్నవరం యుపిఎస్, గుడివాడ వన్ టౌన్, పామర్రు, పడమట, గుడివాడ టూ టౌన్, కంకిపాడు, గుడివాడ రూరల్, పెనమలూరు, నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్లతో పాటు కోనసీమ జిల్లా ఆలుమూరు, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, నర్సాపురం రూరల్, ఎలమంచిలి, రావులపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 21 కేసులు నమోదయ్యాయి.
2026లో రౌడీషీట్ తెరవబడినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ప్రజా భద్రతకు ముప్పుగా మారుతున్నాడని పోలీసులు గుర్తించారు. దీంతో జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు సమర్పించిన నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రివెంటివ్ డిటెన్షన్ (PD) యాక్ట్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం నిందితుడిని రాజమండ్రి కేంద్ర కారాగారంలో నిర్బంధించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను దుర్వినియోగం చేసే వారిపై ఇలాగే కఠిన చర్యలు కొనసాగుతాయని, ఇలాంటి నేరాలకు పాల్పడినా లేదా సహకరించినా చట్టప్రకారం తీవ్రమైన పరిణామాలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.