కస్తూర్బా పాఠశాలలో వివాదం.. "మాకు ఈ టీచర్ వద్దు" అంటూ విద్యార్థుల ఆవేదన
శ్రీ సత్యసాయి జిల్లా, జూలై 29: కదిరి నియోజకవర్గంలోని నంబులపూలకుంట మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలు రూపరాణి, ప్రిన్సిపాల్ రిహానా మధ్య జరిగిన వాగ్వాదం వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ జానకి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రిన్సిపాల్తో జరిగిన వాగ్వాదం సమయంలో విద్యార్థినుల సమక్షంలో హిందీ ఉపాధ్యాయురాలు అసభ్యకర పదజాలం ఉపయోగించడం తీవ్ర అభ్యంతరకరమని చైర్మన్ పేర్కొన్నారు. గతంలో కూడా విధులకు ఆలస్యంగా హాజరు కావడం, తరచూ గైర్హాజరు కావడం, పాఠశాలలో ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం వంటి ఆరోపణలు వచ్చినప్పటికీ సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
హిందీ ఉపాధ్యాయురాలు పలుమార్లు సహోద్యోగులతో ఘర్షణలకు దిగడం, విద్యార్థులను దుర్భాషలాడడం, సమయపాలన పాటించకపోవడం, విద్యార్థులతో వ్యక్తిగత పనులు చేయించుకోవడం వంటి అంశాలపై ఇప్పటికే పలుసార్లు ఫిర్యాదులు చేసినా ప్రవర్తనలో మార్పు రాలేదని ఆరోపించారు. విద్యాబోధనకు కేటాయించాల్సిన సమయంలో విద్యార్థుల సమక్షంలో అనుచితంగా ప్రవర్తించడం వల్ల వారి చదువులకు అంతరాయం కలుగుతోందని పేర్కొన్నారు.
పాఠశాల సిబ్బందిపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రశాంతంగా ఉన్న పాఠశాల వాతావరణాన్ని వివాదాస్పదంగా మారుస్తున్నారని కమిటీ చైర్మన్ ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ హిందీ ఉపాధ్యాయురాలిని పాఠశాలలో కొనసాగించవద్దని పాఠశాల నిర్వహణ కమిటీ అభిప్రాయపడినట్లు తెలిపారు.
ఈ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ నిర్వహించి, వాస్తవాలను వెలికి తీసి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని పాఠశాల కమిటీ, తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.