కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటనకు పటిష్ట భద్రత.. ASL నిర్వహించిన చిత్తూరు అధికారులు
చిత్తూరు | NTODAY NEWS
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 3 నుంచి 5 వరకు కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, బహిరంగ సభలు, ప్రజల నుంచి వినతిపత్రాల స్వీకరణ కార్యక్రమాల్లో పాల్గొననున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ఈ నేపథ్యంలో బుధవారం అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజనింగ్ (ASL) కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్ పాల్గొని హెలిప్యాడ్, సభా ప్రాంగణం, శంకుస్థాపన ప్రాంతాలు, ముఖ్యమంత్రి నివాసం, ద్రావిడ విశ్వవిద్యాలయం, పార్కింగ్ ప్రాంతాలు తదితర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
పర్యటనలో ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రణ, బ్యారికేడింగ్, ప్రవేశ-నిష్క్రమణ మార్గాలు, అత్యవసర వైద్య సేవలు, అగ్నిమాపక ఏర్పాట్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, విద్యుత్, ఇతర మౌలిక వసతులపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ వివరాలను ముందుగానే ప్రజలకు తెలియజేస్తామని పేర్కొన్నారు.
భద్రతలో భాగంగా ప్రత్యేక పోలీసు బలగాలు, బాంబు నిర్వీర్య దళం, డాగ్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్, ట్రాఫిక్ విభాగాల సమన్వయంతో బహుళ స్థాయి భద్రతా వ్యవస్థ అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా జరిగేలా అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టామని, ప్రజలు పోలీసులకు సహకరించి ట్రాఫిక్, భద్రతా సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన జిల్లాకు ప్రతిష్టాత్మకమైందని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సేవలు, పార్కింగ్ తదితర ప్రజా సౌకర్యాలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.