క్వింటాల్ పొగాకు రూ.40 వేలకు కొనాలి – అఖిలభారత కిసాన్ మహాసభ డిమాండ్
ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో జరిగిన పత్రికా సమావేశంలో అఖిలభారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన పొగాకును టుబాకో బోర్డు ద్వారా క్వింటాల్కు రూ.40 వేల చొప్పున కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్డీఏ పాలనలో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, పంటలకు గిట్టుబాటు ధరలు లేక దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని హరినాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, తర్వాత మాట తప్పిందని విమర్శించారు.
అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు భారత రైతాంగానికి నష్టం చేస్తున్నాయని, విదేశీ పత్తిపై దిగుమతి సుంకాలు తగ్గించాలని కోరడం రైతాంగ వ్యతిరేక చర్య కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పత్తి ఎగుమతులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూనే, పొగాకు రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు.
రాష్ట్రంలో జరిగే మహానాడులో అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు ప్రకటించాలని, ధరల స్థిరీకరణ నిధిని రూ.600 కోట్లతో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతాంగ నిరసనలు తప్పవని హరినాథ్ హెచ్చరించారు.