లష్కర్ బోనాల ఉత్సవాలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు మంత్రి కొండా సురేఖ ఆహ్వానం
హైదరాబాద్: తెలంగాణలో అత్యంత వైభవంగా నిర్వహించే ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా జరిగే లష్కర్ బోనాల వేడుకలకు రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. శుక్రవారం లోక్ భవన్లో గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించనున్న లష్కర్ బోనాల మహోత్సవాలకు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
ఈ సందర్భంగా బోనాల ఉత్సవాల ప్రాముఖ్యత, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లపై మంత్రి గవర్నర్కు వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆలయ పరిసరాల్లో భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఈ భేటీలో దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఉజ్జయిని మహంకాళి దేవస్థానం కార్యనిర్వహణాధికారి, అసిస్టెంట్ కమిషనర్ మనోహర్ రెడ్డి తదితర అధికారులు మంత్రి వెంట పాల్గొన్నారు.