సరైన నాయకుడిని ఎన్నుకొని చిట్యాల అభివృద్ధికి తోడ్పడాలి
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
NTODAY NEWS: చిట్యాల
చిట్యాలలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధికి తోడ్పడే నాయకులను ఎన్నుకొని పట్టణ అభివృద్ధికి సహకరించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తెలంగాణ డైరీ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి పిలుపునిచ్చారు.
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.3 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, చిట్యాల పట్టణంలోని అన్ని వార్డుల్లో డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్యాల మున్సిపాలిటీకి రూ.15 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని, ప్రతి వార్డులోని సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాలు సాధించిందని తెలిపారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇళ్లు ఇవ్వలేదని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఎమ్మెల్యే వీరేశం చొరవతో నకిరేకల్ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి మాజీ సర్పంచ్ గుండెబోయిన శ్రీలక్ష్మి, మాజీ ఎంపీటీసీ గుండెబోయిన సైదులు శుక్రవారం 100 మంది అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube